ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరొందిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎన్నికవడం చాలా హాట్ టాపిక్ గా మారింది. ముంబయిలో ఆదివారం జరిగిన సమావేశం లో క్రికెట్ సంఘాల మద్దతు దక్కించుకున్న గంగూలీ.. సోమవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ వేయడానికి ఈ రోజే చివరిరోజు కాగా.. ఎవరూ పోటీ లేకపోవడం తో.. గంగూలీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న బీసీసీఐకి ఓ క్రికెటర్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది రెండోసారి మాత్రమే. 1936లో భారత్ జట్టుకి కెప్టెన్సీ వహించిన విజయనగరం మహారాజు ఎ.కె.ఎ విజ్జీ 1954-56 మధ్యకాలంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఈ అరవై సంవత్సరాలలో ఏ భారత క్రికెటర్కి కూడా అధ్యక్షుడిగా చేయడానికి అవకాశం దక్కలేదు. అయితే.. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ మాత్రం కొంతకాలం బీసీసీఐ తాత్కాలికంగా అధ్యక్షులుగా పనిచేశారు. భారత్ జట్టుకి దూకుడు నేర్పిన కెప్టెన్గా సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. బీసీసీఐ సభ్యత్వం ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు తాజాగా ముంబయిలో సమావేశమై.. అధ్యక్షుడి గా దాదా పేరుని ఖారారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడి గా తాను ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.
బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం గంగూలీ నామినేషన్ దాఖలు చేయగా.. అతనితో పాటు కార్యదర్శి పదవి కోసం జై షా, కోశాధికారి పదవి కోసం అరుణ్ ధూమల్ నామినేషన్స్ వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడైన జై షా కూడా ఏకగ్రీవంగా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తుండగా.. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్ తమ్ముడే అరుణ్ కావడం విశేషం. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ.. గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబరు వరకూ మాత్రమే ఆ పదవి లో ఉంటాడు. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం.. బోర్డు లో రెండు పర్యాయాలు పదవులు చేపట్టిన తర్వాత సభ్యుడు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీ రెండో పర్యాయం ఎన్నికై.. కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Be the first to comment on "బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ"